Tuesday 31 January 2012

Monday 30 January 2012

హలో...ఎవరండీ పైనా?

హలో...నేను కొబ్బరి గొడుగు కింద నుంచి మాట్లాడుతున్నాను! ఎవరండీ పైనా?

Friday 27 January 2012

'నో పానీ..నో పూరీ'.

అనగనగా ఒక కాకి. దానికి ఒక పానీపూరి దొరికింది. పూరీ దొరికితే కర్రీతో తినెయ్యొచ్చు. కానీ ఇక్కడ దొరికింది పానీపూరీ. తప్పనిసరిగా 'పానీ' ఉండి తీరాల్సిందే. ఈ జనారణ్యంలో మంచినీళ్ళను పట్టుకోవడం కంటే మందునీళ్ళను తెచ్చుకోవడం చాల సులభం. ఎలాగైనా సరే 'పానీ' సంపాదించి 'పూరీ' తినాలని దాన్ని ముక్కున కరుచుకుని హైటెక్ సిటీ నుండి ఆర్.ఎఫ్.సి వరకు తిరుగుతూనే ఉంది.విచ్చలవిడిగా వైన్ షాపులు, అక్కడక్కడ కూల్ డ్రింక్ లు తప్ప నీళ్ళు మాత్రం దొరకలేదు. ఏం చెయ్యాలా అని హైవే మీదికి వచ్చి దిక్కులు చూస్తుంటే రోడ్డు పై దూరంగా నీళ్ళు కనిపించాయి. ఆశతో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళింది. విచిత్రంగా అక్కడ నీళ్ళు మాయమైపోయి మరికొంత దూరంలో కనిపించాయి. మళ్ళీ అక్కడకు ఎగురుతూ వెళ్ళింది. మళ్ళీ అదే సీన్..'ఏంటబ్బా ఈ యిచిత్రం?' అనుకుంది కాకి.అప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు వాళ్ళమ్మతో పాటు టీవి చూస్తుండగా సీరియల్ లో చూసిన ఒక పాట 'ఎండమావులే...'. ఒహో ఎండమావులంటే ఇవేనేమో అనుకుంది.
సరే ఇంతకూ  పానీ లేకుండా ఈ పూరీ ఎలా తినాలి?.
ఏం చెయ్యాలో తోచక ఒక చెట్టు కొమ్మమీద కూర్చుని ఆలోచించసాగింది. ఇంతలో ఆ చెట్టు కింద ఒక జిత్తులమారి చేరింది.. అది కాకి ముక్కుకున్న పూరి కొట్టేయాలని ప్లాన్ వేసింది.
'కాకమ్మా...కాకమ్మా'
ఎంటన్నటు తలూపింది కాకి
'నువ్వు చాలా చక్కగా పాడతావంట.. అందరూ అనుకుంటున్నారు. నేను నిన్ను కలిసి నీపాట స్వయంగా వినాలని వెతుకుతూ బయల్దేరితే నువ్వే నాకు కనిపించావు. ఏదీ నాకోసం ఒక్కసారి ఒక పాట పాడవా? అని అడిగింది నక్క.
వెంటనే కాకి ప్లాష్ బ్యాక్ లో వాళ్ళ తాత చెప్పిన స్టోరీని గుర్తుచేసుకుంది. "వెనకటికి ఒక నక్క వాళ్ళ తాతను ఇలాగే ఉబ్బేసి దాని నోట్లో ఉండే జున్ను ముక్కను ఎత్తుకుపోయింది".
ఆవిషయం గుర్తొచ్చిన కాకి "ఒరేయ్ జిక్క (జిత్తులమారి నక్క). నీ మాటలకు మోసపోవడానికి నేనేమి ముత్తాత కాకి ని కాదురా.." అనుకుని దాని నోట్లో వున్న 'పానీపూరీ' కాలితో జాగ్రత్తగా తొక్కి పట్టి పాట అందుకుంది.
"ఆకలేస్తే అన్నం పెడతా.. అలిసొస్తే ఆయిల్ పెడతా" అని పాట మొత్తం 'కా' భాషలో కుమ్మేసింది.
కాకి చాలా తెలివైనదని గుర్తించింది నక్క. కానీ వదలకూడదు ఎలాగైనా 'పానీపూరి' కొట్టేయాలి అనుకుని..
పాట పూర్తవ్వగానే "సూపర్ కాకమ్మా! చాలా బాగుంది. కానీ నువ్వు అచ్చం మీ తాతలాగ ఒద్దికగా పాడావ్. అక్కడే పాట మూడ్ పోయింది" అంది నక్క.
"అంటే" అర్దం కాక అడిగింది కాకి.
"ఈ పాట దేవీశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద పాడితే ఇలా పాడతాడా చెప్పు. స్టేజ్ మొత్తం చిందులేసి చించెయ్యడు. బహుశ నీకు డాన్స్ రాదనుకుంటా అందుకే పాటతో ఆపేసావ్"
అనగానే కాకి..
"నో..నో..నో..నాకు డాన్స్ రాదని అనకు. ఆట ప్రోగ్రాంలో ఓంకార్ అన్నయ్య నా డాన్స్ చూసి 'కాకా..అందరూ డాన్స్  చేస్తారు నువ్వు మాత్రం కుమ్మేస్తావ్' అన్నాడు. సుందరం మాస్టారైతే 'నువ్వు డాన్స్ చేస్తుంటే జ్యోతిలక్ష్మి అనే ఒకావిడ ఉందన్న విషయమే మర్చిపోతున్నాం' అన్నాడు అని గొప్పలు చెప్పింది కాకి.
"అలాగే ఏది ఒక స్టెప్ వేసి చూపించు" అని అడిగింది నక్క.
కాకి ఒకసారి తను ఆట షో లో వేసిన డాన్స్ గుర్తుచేసుకుని స్టెప్ వెయ్యడానికి కాలు పైకి లేపింది. వెంటనే దాని కాలి కింద వున్న 'పానీపూరి' కిందకు జారిపోయింది.ఆలస్యం చెయ్యకుండా నక్క దాన్ని అందుకుంది.అది చూసిన కాకి అవాక్కై అంతలోనే తేరుకుని "ఓరి నక్కబావా. నువ్వు నా దగ్గర్నించి కొట్టేసింది 'పానీపూరి'. అది తినాలంటే 'పానీ' కంపల్సరి. ఈ సిటీ మొత్తం తిరిగినా దాన్ని తినడానికి 'వాటర్' లేదు" అని అంది.
"వాటర్ లేకపోతేనేం కాకమ్మా నాదగ్గర క్వాటర్ వుందిగా" అని జేబులోంచి మందు బాటిల్ తీసి చూపించి, నడ్డి ఊపుతూ కాకిని ఎక్కిరిస్తూ వెళ్ళిపోయింది నక్క.
పాపం కాకి!  'నో పానీ..నో పూరీ'.

Sunday 22 January 2012

ఆదివారం శుభాకాంక్షలు

తెల్లారగట్ల మాంచి నిద్దట్లో ఉండగా ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించి కల్లోనే కళ్ళు తెరిచి చూసాను. చుట్టూ బోలెడంత వెలుగుతో తల స్థానంలో ఎల్.సి.డి మానిటర్ తో చేతిలో కీబోర్డ్, మౌస్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లాంటి పరికరాలతో ఓ విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
ఆకారం, రూపం చాలా కొత్తగా ఉంది.ఇంతకుముందెప్పుడు ప్రత్యక్షంగా అలాంటి వ్యక్తిని చూసిన దాఖలాలు లేవు.ఆలోచించడం అనవసరం అనిపించి...
"ఎవరండీ మీరు?" అని ఆయన్నే అడిగేసాను.
"నన్ను గుర్తుపట్టలేదా?"
"లేదండి..ఎవరండి మీరు?"

"నేను..బ్లాగురాజు ని"
"బ్లాగురాజా? నేనింతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదండి. కొంచం వివరంగా చెప్పండి బుర్ర హీటెక్కిపోతుంది"
"అదేంటి బాలు. ఊసులతీరం అనే ఒక బ్లాగు ని నాలో ఓపెన్ చేసావ్ నన్ను గుర్తించకపోవడమేంటి"

"ఓ మీరా! అయ్యబాబోయ్ సారీయండి. గుర్తుపట్లేపోయాను"
"పర్వాలేదు"
"అది సరేగాని బ్లాగురాజు గారు మీరేంటి ఇలా ఒచ్చేసారు?" అవసరం ఆయనదేమోననుకుని అడిగేసాను.
"ఏముంది నాయనా. ఊసులతీరం అనే బ్లాగ్ ఓపెన్ చేసావ్. మొదట్లో బాగానే టపాలు రాసావ్. ఈ మద్య మరీ టపాలు రాయడం తగ్గించేసావ్. ఇలాగైతే ఎలా చెప్పు"
"అది ఈ మద్య కొంచెం పని ఎక్కువై టైమ్ కుదరట్లేదండి"
"మాకు మాత్రం కుదురుతుందా చెప్పు. ఉన్నంతలో టైమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నీలాంటి వాళ్ళందరికి బ్లాగ్ విషయం గుర్తుచెయ్యట్లేదా"
"కరెక్టేనండి.కానీ..."
"కానీ లేదు కరెన్సీ లేదు. నువ్విలా క్రమశిక్షణ, సమయపాలన లేకుండా బ్లాగునలా వదిలేస్తే..ఆ ఊసులతీరంలో ఊసులు లేక, సందర్శకుల తాకిడి లేక  బోసిపోవట్లేదు?"
"అవునండి"

"నీ బ్లాగులో మొదటి కామెంట్ పెట్టిన రసజ్ఞగారు, నిన్ను తమ కామెంట్లతో ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న జ్యోతిర్మయి, రాజి, జిలేబి, మధురవాణి, సాదారణ పౌరుడు, సుభ, శిశిర, కస్టేఫలి, కొత్తపాళీ,raf raafsun, మీను, వెన్నెల... వీరందరూ నీ గురించి ఏమనుకుంటారు చెప్పు?"
"కరెక్టేనండే.."

"ఏమిటి కరెక్టు..ఇప్పటికైనా కళ్ళు తెరిచి విధిగా టపాలు రాయడం ప్రారంభించు"
"అలాగే బ్లాగురాజుగారు! రేపట్నించి క్రమం తప్పకుండా రాసేత్తానండి"
"రేపటిదాకా ఏమిటి వర్జ్యం. ఇప్పుడే ప్రారంభించు"
"అంటే.. ఇప్పటికిప్పుడు రాసెయ్యమంటే ఏం రాయాలో బుర్రకెక్కట్లేదు. పోని ఏం రాయాలో మీరే చెప్పండి"
"ఏదొకటి రాయ్"
"అదే ఏంటా అని అడుగుతున్నానండి"
"నీకు తోచింది రాసెయ్. ఆఖరికి ఏమీ తోచకపోతే 'ఆదివారం శుభాకాంక్షలు' అని టపా పెట్టు"

"ఆదివారం శుభాకాంక్షలా"
"ఏం.. ఆదివారం శుభాకాంక్షలు చెప్పుకోకూడదా? అదిరోజు కాదా? మీలాంటివాళ్ళు రెస్ట్ తీస్కోవడానికి ఆదివారం కావాలిగాని, శుభాకాంక్షలు చెప్పుకోవడానికి అది పనికిరాదటయ్యా?"
"అ..వస్తుందండి"
"మరింకే.. ఆదివారం శుభాకాంక్షలు అని ఓ టపా రాసిపారెయ్"
"అలాగే బ్లాగురాజా" అని నేను అనగానే బ్లాగురాజు మాయమైపోయాడు.
ఆయన కోరికమేరకు...
బ్లాగరులందరికీ...
"ఆదివారం శుభాకాంక్షలు"

Friday 13 January 2012

భోగివేళ జోగమ్మ గోల

అది జనవరి నెల పన్నెండో తారీకు. ఊరు ఊరంతా నిద్దట్లో ఉండగా ఆ మిసపుటేల అమాంతంగా ఒకటే కేకలు. యార్లగడ్డ సుబ్బారాయుడు ఇంటి పక్కనున్న 'జోగమ్మ' కు మళ్ళీ ఏదో ఉపద్రం ముంచుకొచ్చిందని ఆ కేకలింటే ఇట్టే చెప్పొచ్చు."ఒరే! ఎవర్రా మీరు. నా***లారా. సందకాడ్నించి కంటి మీద కునుకెయ్యకుండా కంట్లో ఒత్తులెట్టుకుని మరీ కాపలాగా వున్నాను. దొంగసచ్చినోళ్ళారా. ఊల్లో ఇంతమంది ఇల్లుండగా మీకు నా ఇల్లే దొరికిందేంట్రా...." జోగమ్మ తిట్ల పురాణం కొనసాతూనే ఉంది.

సంక్రాంతి పండగొచ్చిందంటే భోగి నాడు పాత ఇల్లు వున్నవారు, పాత కలప వున్నవారు వాటిదగ్గర కాపలాగా పడుకోవాల్సిందే. లేదంటే ఆ కలప తెల్లారాక ఏ వీదిలో వేసిన మంటల్లో బొగ్గులై కనిపిస్తుందో  ఎవరికీ తెలీదు.సంక్రాంతి నెల పట్టారంటే చిన్న పిల్లల మార్కెట్ లో 'ఆవు పేడ' కు ఆమాంతంగా డిమాండ్ పెరిగిపోతుంది. భోగి పిడకల్ని ఆవు పేడతోనే చెయ్యాలి. లేదంటే కళ్ళు పోతాయని అనేవారు. ఆవులు, గేదెలు కలిసి వున్న గొడ్ల సావిడి నుండి పేడ తెచ్చి భోగి పిడకలు చెయ్యాలంటే భయం. ఎందుకంటే అందులో గేదె పేడ కలిసిపోయిందేమోనని అనుమానం. అందుకే ఎక్కడన్నా ఒక్క ఆవు పడుకుని ఉందంటే కుర్రగాలం దాని చుట్టూ చేరి అది ఎప్పుడు లేస్తాదా? పేడ ఎప్పుడు వేస్తాదా (అవి లేవగానే చేసె పని అదే) అని ఎదురు చూసేవారు.ఆవుపేడతో గారె సైజు , అరిసె సైజు, అరటి పండు ఆకారం.. ఇలా రకరకాలుగా భోగి పిడకలు తయారు చేసి దండలా గుచ్చి భోగి కోసం ఎదురు చూడటం అలవాటు.

మా ఇంట్లో పిల్లలకు సంక్రాంతి ఎంత ఇష్టమైన పండగో అంత కష్టమైన పండగ. ఎందుకంటే భోగి రోజు తెల్లవారు ఝామునే 4 గంటలకు నిద్రలేపేసేవారు. చలి గిలి అనకుండా పిల్లలందరు గోచీలు పెట్టుకుని స్నానాలకు సిద్దమైపోవాలి. ఆ చలిలో నూతికాడ కూచ్చోబెట్టి నలుగు పెడుతుంటే ఒక పక్క నిద్రమత్తు, మరో పక్క నలుగు మంట, ఇంకో పక్క దోమపోట్లు.. పెద్దవాళ్ళను ఏమీ అనలేక, ఆ బాదలు తట్టుకోలేక ఒక్కొక్కరం ఏడుపురాగాలు మొదలుపెట్టేవాళ్ళం.
"భోగి రోజు వెలుగురాకుండా స్నానం చెయ్యకపోతే ముసలి పెళ్ళాం వస్తుందిర" అని అమ్మమ్మ అంటుంటే అప్పటికి దాని గురించి పూర్తిగా తెలియకపోయినా అదో భయం. నలుగు ఐపోయాక అసలు గండం మరోటి వుంది. అదే తలస్నానం. మెడలు మోకాళ్ళ మీదకు ఆన్చి కుంకుడు పులుసుతో తల రుద్దుతుంటే 'కళ్ళుతెరవకూడదు అనుకుంటూనే తెరిచెయ్యడంతో, కుంకుడు పులుసు కళ్ళలోకి వెళ్ళి ఒకటే మంట. ఆసమయంలో ఎంత కాదనుకున్నా ఏడుపు ఎక్కువయ్యేది. ఆ ఏడుపునంతటినీ పోగొడుతూ ఇంతలో తాతయ్య రోడ్డు మధ్య పేద్ద భోగిమంట సిద్దం చేసి ఒక్కొక్కర్ని పిలిచేవారు. కొత్త బట్టలకు పసుపు రాసుకుని సగంసగం వేసుకుని పిల్లలందరం ఆ మంట చుట్టూ చేరి ఆ మంట వెలుగులో వాటికి బొత్తాములు పెట్టుకుంటూ చలి కాగేవాళ్లం.

అప్పటివరకు దండల్లా వున్న భోగి పిడకలు ఒక్కొక్కటి మంటల్లో కాలి కచ్చికల్లా మిగిలితే ఆ పొడిని తీసుకుని బొట్టులా పెట్టుకుంటుండగా అర్దరాత్రి కేకలు పెట్టిన జోగమ్మ కర్ర ఊతం చేసుకుంటూ ఏడుస్తూ వచ్చేది...ముందుగా నెంబరు కొండయ్య (మాజీ వార్డు మెంబర్) ఇంటికెళ్ళి'అయ్యా కొండయ్యగారా! చూసారా. ఒంటరి ఆడదాన్ని చేసి రాత్రంతా కుర్రగాళ్ళు నా ఇంటి పంచకున్న గెడలన్నీ లాక్కెళ్ళిపోయారయ్యా. మీరియ్యాల సంగం పెట్టించి న్యాయం చెయ్యాలి' అని మొరపెట్టుకుంది. 'నేను మాటాడతాలే' అని నెంబరు కొండయ్య పంపించేత్తే అక్కడ్నించి మా ఇంటి కి వచ్చింది...!

"..అయ్యా రామ్మూర్తిగారా! ఆ పిట్టా ఏసు, ఈ జంగాలోడు, కొంగ సత్తుం, ఏకోబు, దర్మయ్య గారి బండోడు, సూరేకాంతం మేనల్లుడు,బాలాసామి, పెద్దేసు, ..ఈళ్ళందరూ కలిసి భోగి మంటలో వెయ్యడానికి సూర్లో దాచిన గెడలన్నీ ఎత్తుకెళ్ళిపోయారండి. ఈ వయసులో ఈ ముసల్దాన్ని ఏడిపించడం ఏమన్న ఇదాయకమా చెప్పండి? ఆళ్ళ జిమ్మడ, ఆళ్ళ చేతులు పచ్చవాతమొచ్చి పడిపోను.." అంటూ ఏడుపు లంకించుకుంది. ఆవిడ అలా ఏడుస్తుంటే మేమందరం 'అయ్యో పాపం' అనుకుంటూ ఆమె వైపు జాలిగా చూస్తుంటే... "జోగమ్మా! పిల్లలేదో పండగని ముచ్చట పడి అల్లరి చేసుంటార్లే. నువ్వు చెప్పినోళ్ళందరు 'పాపం జోగమ్మ' అని ఇంట్లో వొండుకున్న పిండి వంటలన్నీ మళ్ళీ నీకు పట్టుకొచ్చి పెడతారు కదా. పండగపూట నువ్వలా ఏడటం, వాళ్ళనలా తిట్టడం మంచిదికాదుగాని.. ఇదుగో ఈ వంద పట్టుకెళ్ళి పండగ చేస్కో..వెళ్ళు' అని తాతయ్య ఆమెకు చొక్కా జేబులోంచి వంద రూపాయల నోటు తీసి ఇస్తుంటే ఆమె ముఖంలో సంక్రాంతి పండగ ఆనందమంతా ఒక్కసారిగా కనిపించేది.
***బ్లాగరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు***

Monday 9 January 2012

ఔరా అనిపించే విషయాలు - 3

1. పిరమిడ్లు నిర్మించిన కొత్తలో పూర్తిగా తెల్లగా వుండేవి.

2. మధ్యయుగంలో జపాన్ వైద్యులు దంతాలను చేతితోనే పీకేసేవారు.


3. అధికశాతం పిల్లలు పొడుగులో తండ్రిని, బరువులో తల్లిని పోలి ఉంటారు.


4. మన పొట్టలో దాదాపు 3 కోట్లకు పైగా జీర్ణగ్రంథులున్నాయి.



5. చాకొలెట్ బారులో సగటున 8 సూక్ష్మజీవుల అవశేషాలుంటాయనేది ఒక అధ్యయనం తేల్చిన విషయం.

6. ఏ పేరూ లేని పర్వతాలు, కొండలకు ప్రజలే తమకు నచ్చిన పేరు సూచించే వెసులుబాటు అమెరికాలో ఉందట. ఈ విషయం అమెరికాలో ఉండే బ్లాగరులకె తెలియాలి.


7. జున్నును 24 రకాల క్షీరదాల పాల నుంచి తయారుచేయవచ్చు.

8. మామూలుగా చూసినా తలకిందులుగా చూసినా ఒకేలా కనిపించే సంవత్సరం 1961. అలా కనిపించే సంవత్సరం 6009.


9. మట్టితో అప్పుడే చేసిన పచ్చి కుండని కాల్చడాన్ని 'ఫైరింగ్' అంటారు.


10. మన పాలపుంతలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ సూర్యుడికంటే 25 రెట్లు ఎక్కువ వెలుగునిస్తుందట.